దాణా కుంభకోణం కేసులో బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ను దోషిగా తేల్చుతూ రాంచీలోని సీబీఐ స్పెషల్ కోర్టు ఇవాళ ( శనివారం) సంచలన తీర్పు వెలువరించింది. జనవరి మూడవ తేదీన జైలు శిక్షను ఖరారు చేయనున్నారు. డియోఘర్ ట్రెజరీ కేసులో నిందితునిగా ఉన్న బీహార్ మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రా మాత్రం నిర్దోషిగా బయటపడ్డారు. దాణా కుంభకోణం కింద మొత్తం 5 కేసులు ఉన్నాయి. అందులో ఇవాళ డియోఘర్ కేసులో తీర్పును వెలువరించారు.
దాణా కుంభకోణం ఎలా జరిగిందంటే
లాలూ అధికారంలో ఉన్నప్పుడు బీహార్లో దాణా కోసం రూ.900 కోట్లు ఖర్చు చేశారు. ఆ మొత్తాన్ని అక్రమంగా ప్రభుత్వ ఖజానా నుంచి విత్డ్రా చేసుకున్నారు. పశుసంవర్థకశాఖ పేరుతో ఆ మొత్తం సొమ్మును కాజేశారు. వివిధ జిల్లాల నుంచి ఆ అమౌంట్ను విత్ డ్రా చేశారు. దాణా సరఫరా చేస్తున్నారని లేని కంపెనీలను సృష్టించి.. వాటి పేరుతో డబ్బులు డ్రా చేశారు. తీర్పు సందర్భంగా ఇవాళ రాంచీలోని సీబీఐ కోర్టు ఆవరణకు భారీ సంఖ్యలో జనం చేరుకున్నారు.
లాలూతో పాటు బీహార్ మరో మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రా, మరో 20 మంది కూడా ఈ కేసులో విచారణ ఎదుర్కొన్నారు. సీబీఐ స్పెషల్ జడ్జి శివపాల్ సింగ్ ఈ కేసులో తీర్పును వెల్లడిస్తారు. చైబాసా ట్రెజరీ కేసులో లాలూ ఇప్పటికే దోషిగా తేలారు. అయితే ఆ కేసులో ఆయన బెయిల్పై విడుదలయ్యారు. 1997, అక్టోబర్ 27న దాణా కేసులో మొత్తం 38 మందిపై చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్నవారిలో ఇప్పటికే 11 మంది చనిపోయారు. మరో ముగ్గురు అప్రూవర్లుగా మారారు. మరో ఇద్దరిని దోషులుగా తేల్చారు. అయితే ఇవాళ దాణా కుంభకోణంకు సంబంధించిన డియోఘర్ ట్రెజరీ కేసులో తీర్పును వెల్లడించారు. 1991 నుంచి 1994 మధ్య ఆ ట్రెజరీ నుంచి పశుదాణా కోసం రూ.89 లక్షల విత్డ్రా చేశారు. దాణా కేసులో ఇప్పటివరకు వేర్వేరు కోర్టుల్లో 500 మందిని దోషులుగా తేల్చారు. అందులో లాలూ కూడా ఒకరు.