బాలీవుడ్తోపాటు హాలీవుడ్లోనూ మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ ప్రియాంకా చోప్రా డిసెంబరు 19న జరగనున్న జీ సినీ అవార్డుల వేడుకలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ప్రియాంక వేదికపై ప్రదర్శనను ఇవ్వనున్నారట. ఐదు నిమిషాల ఈ ప్రదర్శనకు ఆమె రూ.5 కోట్లు డిమాండ్ చేసినట్లు సమాచారం. అంటే నిమిషానికి రూ.కోటి అన్నమాట.ప్రస్తుతం ఈ విషయం బాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ప్రియాంక దాదాపు రెండేళ్ల తర్వాత ఓ బాలీవుడ్ పాటకు వేదికపై డ్యాన్స్ చేస్తుండటం విశేషం. ఆమె 2016లో ప్రొడ్యూసర్ గిల్డ్ అవార్డుల వేడుకలో ఓ పాటను డ్యాన్స్ చేశారు. డిసెంబరు 19న నిర్వహించనున్న ఈ అవార్డుల కార్యక్రమంలో ప్రియాంకతోపాటు షాహిద్ కపూర్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తదితరులు వేదికపై తమ ప్రదర్శనలు ఇవ్వనున్నారు.
ప్రియాంక 2016లో ‘జై గంగాజల్’ తర్వాత హాలీవుడ్ సినిమా ‘బేవాచ్’, టీవీ సిరీస్ ‘క్వాంటికో’తో బిజీ అయిపోయారు. ఈ క్రమంలోనే నిర్మాతగా ‘వెంటిలేటర్’, ‘సర్వన్’ అనే మరాఠీ, పంజాబీ చిత్రాలను నిర్మించారు. ప్రస్తుతం ఆమె నిర్మాణంలో మరో రెండు సినిమాలు రూపొందుతున్నట్లు సమాచారం.
