జనసేన అధిపతి పవన్ కల్యాణ్ పై మరోసారి ఘాటు ట్వీట్లు పెట్టాడు సినీవిమర్శకుడు కత్తి మహేశ్. విశాఖపట్నంలో జనసేన కార్యకర్తలతో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై కౌంటర్లు ఇస్తూ వరస ట్వీట్లను పెట్టాడు ఈయన. గత కొన్నాళ్లుగా కత్తి మహేష్కి పవన్ కల్యాణ్ అభిమానులకు మధ్య ప్రచ్ఛన్నయుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేఫథ్యంలో పవన్ తాజా రాజకీయ పర్యటనలపై కూడా మహేశ్ వాడీ వేడీగా స్పందించాడు. పవన్ నువ్వు నోరువిప్పిన ప్రతిసారీ అజ్ఞాతవాసి కాదు, అజ్ఞానవాసి అని తేలుతొంది. మొత్తానికి జనసేన ముఖ్య ఉద్దేశం ప్రజారాజ్యం పార్టీని, చిరంజీవిని మోసం చేసినవాళ్ళని చెప్పుతో కొట్టడం అన్నమాట. అది కాంగ్రెస్తో కలిస్తేనే సాధ్యం అని చెప్పకనే చెప్పావు. కక్ష సాధింపు ముఖ్యమైనప్పుడు లక్ష్య సాధన ఏముంటుంది..
నువ్వు చెప్పిన ఒక విషయం నిజమే.. తండ్రి ముఖ్యమంత్రి అయితే కొడుకు ముఖ్యమంత్రి అవ్వాలని రూల్ ఏమీలేదు. అలాగే అన్న హీరో అయితే తమ్ముడూ హీరో అవ్వాలని లేదుగా.. వారసత్వం మన ఫ్యూడల్ భావజాలపు బానిస భావన. అది అన్ని రంగాల్లో పోవాలి. కాకపోతే ఎర్ర గురివింద తన నలుపెరగనట్టు మాట్లాడితేనే నవ్వొస్తుంటుంది. తప్పు చేస్తే నన్ను కూడా నిలదీయండి.. పొరపాటు చేస్తానేమోగాని.. తప్పు మాత్రం చేయనని చెప్పావు.. ముందు మీ ఫ్యాన్స్ చేస్తున్న గుండాయిజాన్ని ఆపే మంచి పనిచెయ్యి. లేకపోతే, తప్పో పొరపాటో కాదు, మీకు మీ పార్టీకి అదొక గ్రహపాటుగా మారే చాన్స్ ఉంది. పార్టీ ఆఫీసుని సినిమా ఆఫీసులా… ప్రజా ప్రస్థానాన్ని ఆడియో లాంచ్ లాగా మార్చడమే కొత్తతరహా రాజకీయమా… అన్నను, పీఆర్పీని మోసం చేసినవాళ్ళ సంగతి సరే.. మరి చిరంజీవి అన్న గారు జనానికి, కులానికి,పార్టీకి చేసిన మోసం సంగతి గురించి కూడా ప్రశ్నిస్తే సంతోషిస్తామని కత్తి మహేష్ పవన్ పై ప్రశ్నల వర్షం కురిపించాడు.