సమ్మె పేరుతో రాష్ట్రంలో కొంత మంది డిడిలు కట్టకపోవడం వల్ల డిసెంబర్ నెలలో పేదలకు నిత్యవసర సరుకులు అందని పరిస్థితి నెలకొంది. ఈ విషయంపై ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ..పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజెందర్, కమిషనర్ సివి ఆనంద్ లతో సమీక్ష నిర్వహించారు. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పంపిణీకి విముఖంగా ఉన్న డీలర్లను వెంటనే తొలగించి, కొత్త డీలర్లను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించారు. డీలర్లు డిడిలు కట్టని ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా ప్రజలకు నిత్యావసర సరుకులు సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు.
ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో రాష్ట్రంలో రేషన్ పంపిణీ కోసం ఇవాళ ఒక్క రోజే 13303 మంది డీలర్లు డీడీలు తీశారు. కాగా, ఇటీవల కాలంలో మా సమస్యలు పరిష్కరించే వరకు డీడీలు తీసే ప్రసక్తే లేదని రేషన్ డీలర్లు నిరసన తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పౌర సరఫరాలశాఖ సీవీ ఆనంద్ వారితో చర్చలు జరిపారు. ఈ చర్చల్లో భాగంగా డిసెంబర్ 2వ తేదీ వరకు సీఎం కేసీఆర్ గడువు ఇచ్చారని, ఈ లోపు డీడీలు కట్టని రేషన్ డీలర్ల స్థానంలో మరొకరు ఉంటారని కేసీఆర్ మాటగా చెప్పారు. చర్చల అనంతరం.. ఈ రోజు ఒక్క రోజే రాష్ట్రంలో రేషన్ పంపిణీ కోసం 13303 మంది డీలర్లు డీడీలు తీయడం విశేషం.
పేదలకు కడుపునిండా అన్నం పెట్టాలనే సదుద్దేశ్యంతో ప్రభుత్వం కేవలం రూపాయికి కిలో చొప్పున ప్రతీ ఒక్కరికి ఆరు కిలోల బియ్యం అందిస్తున్నదన్నారు సీఎం కేసీఆర్. దీనికోసం వేల కోట్ల భారాన్ని భరిస్తున్నదన్నారు. ఈ సరుకుల పంపిణీ కోసం డీలర్లు కమిషన్ పద్ధతిన పనిచేస్తున్నారని చెప్పారు. కానీ రేషన్ డీలర్లు అసమంజసమైన కోరికలు కోరుతూ, సమ్మె చేస్తామనడం బాధాకరమన్నారు. ఈ సమ్మె పిలుపుకు అర్థం లేదన్న సీఎం.. డీలర్ల చర్య వల్ల పేదలకు సరుకులు అందని దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో అత్యంత కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డిడిలు కట్టిన వారికి వెంటనే సరుకులు పంపించి, డిడిలు కట్టని వారిని తొలగించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు