ఇవాళ శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా అత్యంత వెనుకబడిన తరగతుల కోసం ప్రత్యేక సంస్థ ఏర్పాటుపై ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. మన రాష్ట్రంలో ఉండే అత్యధిక జనాభా బీసీలే అని అన్నారు . 50 శాతానికి పైబడి ఉన్న బీసీల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నదని సీఎం ఉద్ఘాటించారు. ప్రభుత్వానికి బీసీల సంక్షేమానికి మించిన ప్రాధాన్యత వేరొకటి ఉండదని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీల కన్నా బీసీలలో కడు పేదరికంలో ఉన్న వారున్నారని గుర్తు చేశారు. బీసీ కార్పొరేషన్ త్వరలోనే ఇవ్వబోయే సర్వసమగ్ర వివరాలతో డిసెంబర్ 3వ తేదీన బీసీ శాసనసభ్యులు, మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించారు. ఆరోజున బీసీల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం చేయాలనుకున్నటువంటి కార్యక్రమాలు ఏమటి? ఎటువంటి కార్యక్రమాలు అమలు చేయాలి? ఇప్పటి వరకు వారి సంక్షేమం కోసం ఖర్చు చేసింది ఎంత? అనే అంశాలపై సమగ్రంగా మాట్లాడుకుందామని సూచించారు సీఎం. ఎంబీసీల సంక్షేమం కోసం అమూల్యమైన సూచనలు ఇవ్వండి అని సభ్యులకు సీఎం కేసీఆర్ సూచించారు.
