ఏపీలో 2019 ఎన్నికల లక్ష్యంగా పాదయాత్ర ప్రారంభించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి రాష్ట్రా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఒక వైపు పాదయాత్ర చేస్తూనే మరోవైపు రానున్న సార్వత్రిక ఎన్నికల కోసం సైన్యాన్ని సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు జగన్. అందులో భాగంగానే వైసీపీలో కూడికలు తీసివేతలు మొదలు అయ్యాయి.
ఒక వైపు నేతల సామర్ధ్యాలను అంచనా వేస్తూనే.. ప్రత్యర్థి పార్టీల్లో ఉన్న బలమైన అభ్యర్థులెల పై దృష్టిసారిస్తున్నారు. ముఖ్యంగా కందుకూరు నియోజకవర్గంలో టీడీపీ-వైసీపీ మధ్య రాజకీయం రసవత్తరంగా మారింది. వచ్చే ఎన్నికల నాటికి ఎవరు ఏ పార్టీ నుంచి బరిలోకి దిగుతారో తేల్చుకోలేకపోతున్నారు. అధికార పార్టీలో వర్గపోరు ఎసరు పెడుతుంటే.. వైసీపీకి మాత్రం అనుకూల వాతావరణం కనిపిస్తోంది.
గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన పోతుల రామారావు ఆపరేషన్ ఆకర్ష్ నేపథ్యంలో టీడీపీలోకి జంప్ చేశారు. దీంతో కందుకూరు నియోజక వర్గంలో బలమైన నాయకుడి కోసం వైసీపీ వేట మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే మహీధర్రెడ్డిని పలుమార్లు కలిశారు. దీంతో తన నియోజకవర్గంలో సీటుతో పాటు సముచిత స్ధానంపై భరోసా కావాలంటూ మహీధర్రెడ్డి షరతు పెట్టాడని సమాచారం.
ప్రకాశం జిల్లాలో సీనియర్ నేత అయిన మహీధర్రెడ్డికి తనకంటూ ప్రత్యేక వర్గం కూడా ఉంది. చీరాల ఎమ్మెల్యే కృష్ణమోహన్, అన్నా రాంబాబు, ముక్కు కాశిరెడ్డి, ఉగ్ర నరసింహారెడ్డి ఇలా చాలామంది మహీధర్రెడ్డికి విశ్వాసపాత్రులు. దీంతో వైసీపీలోకి మాజీ మంత్రి వచ్చి చేరితే తమ పార్టీకి బలమైన అండ దొరుకు తుందని వైసీపీ సీనియర్ నేతలు జగన్ వద్ద ప్రస్తావించగా.. జగన్ కూడా పచ్చ జండా ఊపారని సమాచారం. దీంతో జగన్ పాదయాత్ర అయ్యే లోపు మహిధర్ రెడ్డి వైసీపీలోకి చేరడం ఖాయమని వైసీపీ వర్గీయులు చర్చించుకుంటుండగా.. ఈ మాజీ కేంద్ర మంత్రి టీడీపీలోకి వచ్చి చేరితే టీడీపీకి కందుకూరు నియోజక వర్గంలో భారీ షాక్ తగలడం కాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.