పురపాలక సంఘాల బలోపేతం కోసం రాష్ట్ర మున్సిపల్ మంత్రి కేటీఆర్ కీలక నిర్ణయం ప్రకటించారు. పురపాలక సంఘాల సర్వతోముఖాభివృద్ధికి గాను ప్రతి మున్సిపాలిటీకి 10 కోట్ల రూపాయలు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. పలు పురపాలక సంఘాలలో సిబ్బంది కొరత సమస్య ఉన్నందున రిక్రూట్మెంట్ ప్రక్రియ జరుగుతున్నట్టు కేటీఆర్ చెప్పారు. 30 జిల్లా కేంద్రాలు, అర్బన్ డెవలప్ మెంటు అధారిటీ లకు వెంటనే పట్టణ మాస్టర్ ప్లాన్ రూపొందించి పంపాలని పురపాలక మంత్రి ఆదేశించారు.ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజా ప్రతినిధులు, మునిసిపల్ అధికారులతో సోమవారం ఇక్కడ సచివాలయం లో ఇద్దరు మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహించారు. పురపాలక సంఘాల్లో చేపట్టవలసిన కార్యక్రమాలపై ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రులు ఈ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ సిద్ధిపేట పట్టణం మరో 13 గ్రామాలు కలుపుకొని “ సుడా’` గా మారుతున్నందున ఎలాంటి జాప్యం లేకుండా సిద్ధిపేట మాస్టర్ ప్లాన్ ఆమోదం కోసం పంపించాలని కోరారు. ఏడాది తర్వాత జరగనున్న ఎన్నికల నేపథ్యంలో మున్సిపాలిటీల రూపు రేఖలు సంపూర్ణంగా మార్చాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,మున్సిపల్ చైర్మన్లు, కమిషనర్లను మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ఆదేశించారు. ప్రతి మున్సిపాల్టీ సిద్ధిపేట లాగా ఆదర్శ మున్సిపాలిటీగా మారాలని కేటీఆర్ అన్నారు.
త్వరలో ఉమ్మడి మెదక్ జిల్లాను బహిరంగ మలవిసర్జన రహిత జిల్లా గా ప్రకటించేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి కేటీఆర్ కోరారు. ఆందోల్ వంటి అసెంబ్లీ నియోజక వర్గంలో పెండింగులో ఉన్న ఓడీఎఫ్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. ముఖ్యంగా ప్రతి పట్టణాన్ని స్వచ్ఛ పట్టణంగా తయారుచేసేందుకు పారిశుధ్యానికి అత్యంత అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఇందుకోసం అవసరమైన రవాణా వాహనాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రతి పట్టణంలోనూ మొదటి దశలో ప్రయోగాత్మకంగా తడి, పొడి చెత్త కార్యక్రమాన్ని ఎంచుకున్న వార్డుల్లో ప్రారంభించాలన్నారు. గజ్వేల్ ,సిద్ధిపేట మునిసిపాలిటీల్లో చేపడుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలతో సహా ఇతర అన్ని కార్యక్రమాలను కేటీరామారావు అభినందించారు.
Minister @KTRTRS held a review meeting with Dy Speaker Padma Devender Reddy & @trsharish on Medak District (erstwhile) Municipalities. pic.twitter.com/qXPilSB1tU
— Min IT, Telangana (@MinIT_Telangana) November 13, 2017
సిద్ధిపేటలో అమలు చేస్తున్న కార్యక్రమాలను అధ్యయనం చేసి వాటిని యథాతథంగా అమలు చేయాలని మంత్రి కేటీఆర్ కోరారు. కోమటి చెరువు, వైకుంటధామం వంటి కార్యక్రమాలను కేటీఆర్ ప్రశంసించారు. ప్రభుత్వం అందించే ఈ 10 కోట్ల ప్రత్యేక నిధులతో ప్రజలకు అవసరమైన పార్కులు, మోడల్ మార్కెట్లు, స్మశానాల అభివృద్ధి, పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీలు, నగర పంచాయతీల వారీగా మంత్రులు సమీక్ష జరిపారు. 15 వేలు పై బడిన జనాభా ఉన్న గ్రామ పంచాయతీలన్నింటినీ నగర పంచాయతీలుగా మార్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదివరకే నిర్ణయం తీసుకున్న విషయాన్ని మంత్రి కేటీఆర్ తెలిపారు. మెదక్ జిల్లాలో నర్సాపూర్, రామాయం పేట, సంగారెడ్డిలో నారాయఖేడ్ గ్రామ పంచాయతీలుగా మార్చాలని మంత్రి హరీశ్ రావు కోరారు.