వైసీపీ అధినేత వైఎస్ జగన్ పాదయాత్ర మూడురోజులు పూర్తి చేసుకుని నాలుగో రోజుకు చేరుకుంది. ఇక నాలుగోరోజు అనుకున్న సమయం కంటే రెండు గంటల పాటు ఆలస్యంగా జరుగుతోంది. పెద్దయెత్తున అభిమానులు తరలి రావడం, స్థానిక గ్రామాల ప్రజలు జగన్తో కరచాలనం చేయాలని ఉత్సాహ పడుతుండటంతో ఆయన అందరినీ చిరునవ్వుతో పలకరిస్తూ ముందుకు సాగుతున్నారు.
జగన్ కేవలం పాదయాత్ర మాత్రమే చేయడం లేదు. వివిధ సంఘాల స్థానిక నేతలతో ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. వారి సమస్యలను ఓపిగ్గా వింటున్నారు. వాటిని తన మేనిఫేస్టోలో చేరుస్తానని చేతిలో చెయ్యేసి మరీ చెబుతున్నారు. దీంతో జగన్ తీరుకు స్థానికులు ఫిదా అవుతున్నారు. మూడోరోజు ఆయన ముస్లిం సోదరులతో కలసి ప్రార్థనల్లో పాల్గొన్నారు. వీరగట్టుపల్లిలో బీసీ సంఘాల నేతలతో సమావేశమయ్యారు. బీసీ సంఘాల నేతలు చెప్పిన సమస్యలను నోట్ చేసుకున్నారు. వీటిని మ్యానిఫేస్టోలో ఉంచేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు.
ఇక జగన్ పాదయాత్ర ఈరోజు నాలుగోరోజుకు చేరుకుంది. ఇప్పటి వరకూ జగన్ దాదాపు నలభై కిలోమీటర్ల మేరకు ప్రయాణించారు. నాల్గోరోజు పాదయాత్ర ఉరుటూరు గ్రామం నుంచి ప్రారంబించారు. ఈ యాత్ర సర్వరాజుపేట గ్రామం మీదుగా.. వై కొండూరు జంక్షన్కు జగన్ చేరుకొని అక్కడే భోజన విరామానికి ఆగుతారని సమాచారం. అక్కడి నుంచి ఎర్రగుంట్ల పట్టణానికి చేరుకుంకొని ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డులో రాత్రి బస చేస్తారు. నాల్గో రోజు పాదయాత్రలో భాంగంగా నిర్వహించే ఒక బహిరంగ సభలో జగన్ ప్రసంగించనున్నారు. ఇక మరోవైపు తనపై వస్తున్న ఆరోపణలకు ఎప్పటికప్పుడు జగన్ సమాధానమిస్తున్నారు. టీడీపీ నేతలు చేసే విమర్శలను ప్రజల సమక్షంలోనే తిప్పికొడుతున్నారు.