ప్రపంచస్థాయి పారిశ్రామికవేత్తల సదస్సు, పలు అంతర్జాతీయ సదస్సుల నేపథ్యంలో హైదరాబాద్ రహదారులపై భిక్షాటనను నగర పోలీసులు రెండు నెలల పాటు నిషేధం విధించారు. ఇది పోలీస్ చరిత్రలోనే తొలిసారి. నవంబరు 8 (బుధవారం) ఉదయం 6గంటల నుంచి జనవరి 7 వరకు అమలులో ఉంటుంది. బహిరంగ ప్రదేశాలు, రహదారులు, ముఖ్య కూడళ్లలో యాచకులు కనిపించరాదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దివ్యాంగులు, పిల్లలను ఎత్తుకుని మహిళలు అడుక్కోవడం, పిల్లల యాచకంతోపాటు ఇతర వృద్ధ యాచకులు సైతం వాహనాలను ఆపి ఇబ్బందిపెట్టడం, అడ్డుపడడం ఉండరాదని అందులో పేర్కొన్నారు. రాజధానిలో ఈ నెల 28, 29, 30 తేదీల్లో నిర్వహిస్తున్న సదస్సుకు విదేశీ ప్రతినిధులు హాజరుకానున్న నేపథ్యంలో ఈ ఆదేశాన్ని విధించినట్లు తెలుస్తోంది. పోలీస్ చట్టం 1348, యాచక చట్టం 1977, జేజే చట్టాన్ని పోలీసులు పక్కగా అమలు చేస్తున్నారు.
