ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నిన్న బుధవారం ఆ పార్టీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు .ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు,ఎంపీలు ,నేతలు ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తున్నారన్న విషయమై సమీక్షించి.తను కొన్ని విశ్వసనీయ వర్గాల ద్వారా సేకరించిన రిపోర్టు గురించి ప్రస్తావిస్తూ ఒక్కొక్క ఎమ్మెల్యేపై సెటైర్లు వేస్తూ వారికి చురకలు అంటించారు .
అందులో భాగంగా పెనమలూరు అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే బోడె ప్రసాద్, గన్నవరం ఎమ్మెల్యే వంశీ తదితరులు తమ సొంత టెక్నాలజీని వాడుతున్నారని, మన ప్రభుత్వం ఇచ్చే టెక్నాలజీ పనిచేయడం లేదా? అని వారిపై చమత్కరించారు.మరోవైపు తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రస్తావనకు వచ్చిన సమయంలో ఆయన ఎక్కడున్నాడని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. దీంతో అధికారులు ఆయన ఢిల్లీ వెళ్లారని చెప్పడంతో చంద్రబాబు “అయితే అడిగానని చెప్పండి. క్షేమాన్ని అడగండి” అంటూ జోకేశారు. నెల్లూరు జిల్లా ఎమ్మెల్యే రామారావు విదేశీ పర్యటన గురించి, ఆ జిల్లా నేతలు చెప్పగా, మళ్లీ అదే శైలిలో ‘ఆయనకు ఇంటర్నెట్ ద్వారా హలో చెప్పండి’ అని ఆయన అన్నారు.
గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అక్కడున్న అందరినీ నవ్వించాయి. “కుమారస్వామిలా కష్టపడి తిరగకుండా వినాయకుడిలా ఈశ్వరుడి చుట్టూ తిరిగితే చాలని అనుకుంటున్నావా?” అని బాబు ఆయన్ని ప్రశ్నించారు. దీంతో అవాక్కైన ఆయనబదులిస్తూ, అన్ని ఇళ్లకు వెళుతున్నానని, బయటి నియోజకవర్గాలు కూడా తిరుగుతున్నందున తన సొంత ప్రాంతంలో కాస్తంత ఆలస్యమైందని ఆయన వివరణ ఇచ్చారు.ప్రకాశం జిల్లా ఎమ్మెల్యే డేవిడ్ రాజును చూసి, రోజుకు ఎన్ని కిలోమీటర్లు తిరుగుతున్నారని చంద్రబాబు ప్రశ్నించగా, పది కిలోమీటర్లు తిరుగుతున్నానని ఆయన బదులిచ్చారు. “ఓ… అయితే మీ ఫిట్ నెస్ బాగుంటుంది” అని చంద్రబాబు కితాబిచ్చారు.