అలనాటి నటి, భాజపా ఎంపీ హేమ మాలినికి తృటిలో ప్రమాదం తప్పింది. బుధవారం ఆమె తన నియోజకవర్గమైన ఉత్తర్ప్రదేశ్ మథురలోని ఓ రైల్వే స్టేషన్ను సందర్శించారు. ఈ నేపథ్యంలో ఆమె ప్లాట్ఫాంపై నడుచుకుంటూ వెళుతుండగా ఓ ఎద్దు మీదకు దూసుకొచ్చింది.
వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆమెకు రక్షణ కల్పించారు. అనంతరం పలువురు వ్యక్తులు ఎద్దును అదుపుచేసి బయటకు తరలించారు.ఇటీవల ముంబయిలోని ఎల్ఫిన్స్టోన్ వంతెన తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 20 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఎంపీలను తమ నియోజకవర్గంలోని అన్ని రైల్వే స్టేషన్లను పరిశీలించాల్సిందిగా ఆదేశించారు. ఈ నేపథ్యంలో హేమ మాలిని మథుర రైల్వే స్టేషన్ను సందర్శించారు.