ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజాపై తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం ఎస్సై నాగరాజు దురుసుగా ప్రవర్తించారు. రోడ్డు పక్కన పార్క్ చేసిన కారును తీయలేదని ఆయనపై దౌర్జన్యానికి దిగారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తీవ్ర ఆగ్రహానికి గురైన ఎస్సై నాగరాజు.. రాజా కాలర్ పట్టుకు బలవంతంగా తోసుకుంటూ పోలీస్ జీపు ఎక్కించి స్టేషన్కు తీసుకెళ్లారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్టేషన్కు తీసుకెళ్లి రాజాను లాఠీలు విరిగేలా కొట్టారని స్థానిక వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
రాజా ఆదివారం సాయంత్రం తన భార్య రాజశ్రీ, ఐదు నెలల పాపతో కలసి ద్రాక్షారామం నుంచి రాజమహేంద్రవరం వైపు కారులో వెళ్తున్నారు. మధ్యలో రామచంద్రపురంలోని మసీదు సెంటర్ వద్దనున్న నగల దుకాణం వద్ద కారు ఆపారు. చంటిపాపను రాజాకు అప్పగించి ఆయన భార్య నగల షాపులోకి వెళ్లారు. ఈలోగా అక్కడికి వచ్చిన ఎస్సై నాగరాజు.. కారు తీయాలంటూ హుకుం జారీ చేశారు. చేతిలో చంటి పాప ఉందని.. తన భార్య షాపులో నుంచి వచ్చిన వెంటనే తీసేస్తానని రాజా చెప్పారు. దీంతో ఎస్సైకి కోపం వచ్చింది. తాను మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు కుమారుడినని, వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడినని రాజా చెప్పడంతో ఎస్సై ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
రాజాను కాలర్ పట్టుకొని కారు లోపలి నుంచి బయటకు లాగారు. ఇంతలో నగల షాపు నుంచి వచ్చిన రాజశ్రీ.. చంటిబిడ్డను తన చేతిలోకి తీసుకున్నారు. అనంతరం పోలీసులు రాజాను స్టేషన్కు తీసుకెళ్లారు. ఆదివారం రాత్రి వరకు రాజా స్టేషన్లోనే ఉన్నారు. దీంతో స్థానిక వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న వైసీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు పార్టీ నేతలతో కలసి రామచంద్రపురం పోలీస్స్టేషన్కు చేరుకొని ఆందోళనకు దిగారు. రాజాను అరెస్టు చేయడమే కాకుండా అమానుషంగా లాఠీలతో కొట్టారని, ఆయన వీపుపై లాఠీ దెబ్బలు స్పష్టంగా కనిపిస్తున్నాయని కన్నబాబు వెల్లడించారు.