టెలికాం మేజర్ భారతీ ఎయిర్టెల్ సెల్కాన్ ..మొబైల్ ఫోన్ తయారీదారు సెల్కాన్తో జతకట్టింది. ముఖ్యంగా ప్రత్యర్థి రిలయన్స్ జియోకు చెక్ పెట్టేలా త క్కువ ధరలో 4 జి స్మార్ట్ఫోన్ లాంచ్ చేసింది. తన చందాదారులకు అతి తక్కువ ధరకే మొబైల్ అందించే వ్యూహంలో ఈ భాగస్వామ్యాన్ని కుదుర్చుంది. సెల్కాన్ తో కలిసి రూ.1,349 కే స్మార్ట్ఫోన్ను అందజేయనున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ‘మేరా పెహ్లా స్మార్ట్ఫోన్’ పథకంలో భాగంగా ఫీచర్ ఫోన్ ధరలోనే స్మార్ట్ఫోన్ను అందించనున్నట్టు ఎయిర్టెల్ తెలిపింది. ‘సెల్కాన్న్ స్మార్ట్ 4 జి’ (మార్కెట్ ధర రూ. 3,500) పేరుతో దీన్ని విడుదల చేయనుంది. 4 అంగుళాల టచ్ స్క్రీన్ డ్యూయల్ సిమ్, ఆండ్రాయిడ్ ఆధారిత 4జీ స్మార్ట్ఫోన్ లో గూగుల్ ప్లే లోని వాట్సాప్, ఫేస్బుక్, యూ ట్యూబ్ తదితర అన్ని యాప్లకు అనుమతి ఉంది.
ఇటీవల కార్బన్ ఎ40 ఇండియన్ పేరిట కేవలం రూ.1399కే 4జీ ఆండ్రాయిడ్ ఫోన్ను విడుదల చేసిన ఎయిర్టెల్ తాజాగా సెల్కాన్తో జతకట్టి మరో 4జీ ఆండ్రాయిడ్ ఫోన్ను విడుదల చేసింది. అయితే ఈ సెల్కాన్ స్మార్ట్ 4జీ ఫోన్ను వినియోగదారులు ముందుగా రూ.2,849 చెల్లించి కొనుగోలు చేయాల్సి ఉంటుది. ఇందులో నెలకు రూ.169 రీచార్జ్ ఇన్బిల్ట్గా ఉంటుంది. ఇలా నెలకు రూ.169 చొప్పున 36 నెలల పాటు రీచార్జి చేస్తూ ఫోన్ను వాడాలి. అలా వాడితే మొదటి 18 నెలలకు రూ.500, తరువాత 36 నెలలకు రూ.1000 వెనక్కి ఇస్తారు. అంటే మూడు సంవత్సరాలకు మొత్తం రూ.1500 వెనక్కి ఇస్తుంది. ఈ లెక్క ప్రకారం ఫోన్ ధర కేవలం రూ.1349 మాత్రమే అవుతుందని కంపెనీ ప్రకటించింది. ఈ ప్లాన్ ద్వారా అన్లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ కాల్స్ తోపాటు రోజుకు 500 ఎంబీ 4జీ డేటా ఉచితం. వాలిడిటీ 28 రోజులు.