ప్రముఖ సినీనటి, ఏఐసీసీ అధికార ప్రతినిధి ఖష్బూకు నవంబర్ నాలుగో తేదీన ఆపరేషన్ జరుగనుంది. ఇటీవల ఖుష్బూ ఇంటిలో జారిపడటంతో ఆమె మోకాలికి దెబ్బ తగలింది. ఆ గాయానికి చికిత్స చేయించుకోగా ఆమె కోలుకున్నారు. అయితే ఉన్నట్టుండి ఆమెకు కడుపు నొప్పి రావటంతో వైద్యులను సంప్రదించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి ఖుష్బూ కడుపులో చిన్న కణితి ఉన్నట్లు కనుగొన్నారు. ఆ కణితిని తొలగించేందుకు నవంబర్ నాలుగన తాను ఆపరేషన్ చేసుకోనున్నట్లు ఖుష్బూ తెలిపారు. ఈ కారణంగా రెండు వారాలపాటు తాను పూర్తిగా విశ్రాంతి తీసుకోవాల్సి ఉండటంతో నవంబర్ నాలుగు, ఎనిమిది, 17 తేదీలలో జరిగే ఇందిరా శతజయంతి వేడుకల సభలకు తాను హాజరుకాలేనని ఆమె పేర్కొన్నారు.
