తెలంగాణ రాష్ట్ర భౌగోళిక, సాంఘిక, రాజకీయ, నైసర్గిక, సాంస్కృతిక సమాచారం మరింత సులభంగా, సమగ్రంగా ప్రజలకు చేరువకానున్నది. ఇందుకోసం ఇంటర్నెట్ లో మెరుగైన సమాచారాన్ని అందించే వికీపీడియాతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకొన్నది. బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సెంటర్ ఫర్ ఇంటర్నెట్ సొసైటీతో రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్శాఖ మధ్య అంగీకారం జరిగింది.
రాష్ట్ర ఐటీశాఖ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్, సీఐఎస్ ఏ2కే సంస్థ తెలుగు కమ్యూనిటీ ప్రతినిధి పవన్ సంతోష్, రాష్ట్ర ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్, ప్రముఖ వికీమీడియా స్కాలర్ ప్రణయ్రాజ్ సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడినందున పబ్లిక్ డొమైన్లో సమాచారం పూర్తిస్థాయిలో లేదని, ఈ ఒప్పందంతో లోటు తీరుతుందని జయేశ్రంజన్ చెప్పారు. వికీమీడియా ద్వారా తెలుగు, ఉర్దూలో విస్తృత సమాచారం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వలంటీర్లకు ఈ ఒప్పందం మేలు చేస్తుందన్నారు.