త్వరలోనే హోంగార్డుల సమస్యను పరిష్కారిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు . శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సీఎం మాట్లాడారు.రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ విషయంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. కాంట్రాక్టు సిబ్బందిని క్రమబద్దీకరిస్తామంటే కోర్టులకు వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేశారని గుర్తు చేశారు. శాశ్వత ఉద్యోగాల కోసం ఔట్సోర్సింగ్ తీసుకోవడం నిలిపివేస్తున్నామని ప్రకటించారు. వీరిని క్రమబద్దీకరించే క్రమంలో న్యాయపరమైన చిక్కులు వస్తున్నాయని తెలిపారు.గత ప్రభుత్వాలు ఉద్యోగులు అర్ధాకలితో పని చేసేందుకు శ్రీకారం చుట్టాయన్నారు. అర్ధాకలితో ఎవరూ పని చేయొద్దని టీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. అందరికీ ఉద్యోగాలను కల్పించలేదు. ప్రభుత్వ, ప్రయివేటు రంగంలో ఉపాధి కల్పన లభించేలా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఉద్యోగ కల్పన విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కొంతమంది అభాసుపాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల హక్కులకు భంగం కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.
