దాదాపు 65 ఏళ్లుగా తన పాటలతో శ్రోతలను అలరించిన గానకోకిల ఎస్.జానకి సంచలన నిర్ణయం తీసుకున్నారు. గాయకురాలిగా రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టు ప్రకటించారు. 65 ఏళ్ల క్రితం మైసూరులో పాటలు పాడటం ప్రారంభించానని… తన చివరి కచేరిని కూడా అక్కడే ఇచ్చి, విశ్రాంతి తీసుకుంటానని చెప్పారు. ఈ నెల 28న మానసగంగోత్రి మైదానంలో తన చివరి కచేరి జరుగుతుందని ఆమె తెలిపారు. వయసు పైబడుతుండటంతో పాడటం కష్టంగా మారిందని… అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. మైసూరులో మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ విషయాలను వెల్లడించారు. దక్షిణాదితోపాటు 17 భాషల్లో 48 వేలకు పైగా పాటలను ఆలపించిన గాయని ఎస్ జానకమ్మ. అంతేకాదు అరబిక్, జపనీస్, జర్మన్, లాటిన్ భాషల్లోనూ తన గానంతో అలరించారు.
దక్షిణ భారత గానకోకిలగా జానకమ్మను పేర్కొంటారు. నాలుగు జాతీయ అవార్డులను, వివిధ రాష్ట్రాలకు చెందిన 33 సినిమా అవార్డులను సొంతం ఆమె చేసుకున్నారు. అయితే 2013లో కేంద్ర ప్రభుత్వం ఆమెను పద్మభూషణ్ అవార్డుకు ఎంపికచేస్తే దానిని తిరస్కరించారు. తనను ఇంత ఆలస్యంగా గుర్తించినందుకే పద్మభూషణ్ను తిరస్కరించినట్లు జానకి తెలిపారు. 1957లో విద్యని విలయట్టు అనే తమిళ సినిమాతో గాయనిగా కెరీర్ ప్రారంభించిన జానకమ్మ, ఎంఎల్ఏ చిత్రంతో తెలుగులో అరంగేట్రం చేశారు. గాయనిగా మారిన తొలి ఏడాదిలోనే ఆరు భాషల్లో పాటలు పాడిన ప్రతిభాశాలి. ఉషాకిరణ్ మూవీస్ సంస్థ నిర్మాణంలో వచ్చిన మౌనపోరాటం సినిమాకు సంగీత దర్శకత్వం వహించి తనలో ఈ టాలెంట్ కూడా ఉందని నిరూపించారు.