భూములు కోల్పోయిన వారి కుటుంబాల్లో.. ఇంటికి ఒకరికి టెక్స్టైల్ పార్కులో ఉద్యోగం కల్పించి … వారికి శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామని మంత్రి కేటీఆర్ భరోసానిచ్చారు. కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్క్కు శంకుస్థాపనం సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.మన వరంగల్ జిల్లా నుంచి వలసపోయిన నేతన్నలతో సీఎం కేసీఆర్ సమావేశమై ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. 1200 ఎకరాల భూమి కోల్పోతున్నప్పటికీ.. రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చినందుకు వారికి చేతులెత్తి నమస్కరిస్తున్నానని తెలిపారు. మొదటి రోజునే ఈ పార్క్లో 14 సంస్థలు.. 3,900 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి వచ్చాయని చెప్పారు. ప్రస్తుత ఒప్పందాలతోనే 25 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి దొరుకుతుందన్నారు. తెల్ల బంగారాన్ని పండించే రైతులు తెలంగాణలో కోకోల్లలుగా ఉన్నారు. ఈ పత్తిని నూలుగా వడికే అపారమైన నేతన్నలు తెలంగాణలో ఉన్నారని తెలిపారు. భారతదేశంలోనే అతిపెద్దదైన టెక్స్టైల్ పార్క్కు శంకుస్థాపన జరగడం శుభసూచకమని మంత్రి కేటీఆర్ తెలిపారు.అంతర్జాతీయ ప్రమాణాలతో.. కాలుష్యం లేకుండా పార్క్ను ఏర్పాటు చేసుకోబోతున్నాం. సంవత్సరం లోపే పార్క్ ప్రారంభం చేస్తామన్నారు కేటీఆర్.
