బీసీసీఐ తనపై జీవితకాల నిషేధం ఎత్తివేయకపోతే వేరే దేశం తరఫున ఆడటానికైనా తాను వెనకాడనని క్రికెటర్ శ్రీశాంత్ సూచన ప్రాయంగా చెప్పాడు. తనపై బీసీసీఐ విధించిన జీవితకాల నిషేధాన్ని సమర్థిస్తూ కేరళ హైకోర్టు తీర్పు చెప్పడంతో శ్రీశాంత్ అవమాన భారంతో రగిలిపోతున్నాడు. ఇంకా తనకు క్రికెట్ ఆడే సామర్థ్యం ఉందని, బీసీసీఐ వద్దంటే వేరే దేశం తరఫున ఆడటానికి సిద్ధంగా ఉన్నానని అంటున్నాడు. దుబాయ్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీశాంత్.. ఈ మేరకు ఆసియానెట్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి మాట్లాడాడు.
‘నాపై బీసీసీఐ నిషేధం విధించింది. ఐసీసీ కాదు. నేను వేరే ఏ దేశం తరఫునైనా ఆడొచ్చు. ప్రస్తుతం నా వయసు 34 ఏళ్లు. ఇంకో ఆరేళ్లపాటు ఆడగల సామర్థ్యం నాకు ఉంది. క్రికెట్ను ప్రేమించే ఒక వ్యక్తిగా, నేనింకా ఆడాలని కోరుకుంటున్నాను. వాస్తవానికి బీసీసీఐ ఒక ప్రైవేటు సంస్థ. మనది భారత జట్టు అని చెప్పుకున్నా.. బీసీసీఐ ప్రైవేట్ సంస్థ అని మీకు తెలుసు. కాబట్టి నేను వేరే దేశం తరఫున ఆడినా, బీసీసీఐ లాంటి ప్రైవేటు సంస్థకి ఆడినట్టే. అయితే కేరళ తరఫున రంజీ ట్రోఫీలో పాల్గొనడం అనేది దీనికి విరుద్ధం. కేరళ తరఫున రంజీ ట్రోఫీ, ఇరానీ గెలవాలని కలలు కన్నాను. కానీ నా ఆశలపై బీసీసీఐ నీళ్లు చల్లింది’ అని శ్రీశాంత్ వ్యాఖ్యానించాడు.
ఐపీఎల్ 6వ సీజన్ (2013) సందర్భంగా జరిగిన స్పాట్ఫిక్సింగ్, బెట్టింగ్ కుంభకోణంలో అప్పటి రాజస్థాన్ రాయల్స్ ఆటగాడైన శ్రీశాంత్పై అభియోగాలు రుజువు కావడంతో బీసీసీఐ జీవితకాల నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ పోలీసులు సరైన సాక్ష్యాధారాలు సమర్పించని కారణంగా 2015లో పాటియాల కోర్టు శ్రీశాంత్తో పాటు అంకిత్ చవాన్, అజిత్ చండీలాపై బోర్డు విధించిన నిషేధాన్ని తొలిగించింది. అయినా, బీసీసీఐ తన క్రమశిక్షణ కమిటీ నిర్ణయానికే కట్టుబడతూ శ్రీశాంత్పై ఉన్న నిషేధాన్ని కొనసాగించింది. గతేడాది శ్రీశాంత్ కేరళ హైకోర్టును ఆశ్రయించడంతో.. సింగిల్ జడ్జ్ బెంచ్ నిషేధాన్ని ఎత్తివేసింది. అయితే దీనిపై బీసీసీఐ మళ్లీ కేరళ హైకోర్టులో పిటిషన్ వేయడంతో మళ్లీ నిషేధాన్ని పునరుద్ధరించాలని డివిజన్ బెంచ్ తీర్పునిచ్చింది.