దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరణ గురించి బీజేపీ ప్రణాళిక వేయడం గురించి మంత్రి కేటీఆర్ ఆసక్తికరమైన రీతిలో స్పందించారు. ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రి కేటీఆర్ అనేక అంశాలపై స్పందించారు. ఈ సందర్భంగా బీజేపీ విస్తరణ గురించి సదరు జర్నలిస్ట్ ప్రస్తావించడంతో…‘కలలు కనడంలో తప్పేం లేదు. బీజేపీ నేతలు తమది తాము జాతీయ పార్టీగా భావించుకుంటున్నప్పటికీ… దక్షిణాదిలోని నాలుగు రాష్ట్రాల్లో ఒక్క కర్ణాటక మినహా మిగతా చోట్ల ఆ పార్టీకి ఉన్న బలం తక్కువే. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం సీపీఐకి జాతీయ పార్టీ గుర్తింపు ఉన్నప్పటికీ దేశంలో ఎలాంటి ఉనికి లేదు’ అని వ్యాఖ్యానించారు.
తెలంగాణపై పెద్దనోట్ల రద్దు ప్రభావం గురించి ప్రస్తావించగా… ‘రాష్ట్రంపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం పడింది. ఎస్ఎంఈలపై తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. ఆ వ్యాపార కష్టాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. మరో మూడు నెలల పాటు ఇలాంటి పరిస్థితులే. జీఎస్టీ ప్రభావం కూడా ఆయా సంస్థలపై పడింది’ అని తెలిపారు. పురపాలక, పరిశ్రమల శాఖా మంత్రిగా చేపట్టిన అంశాల గురించి వివరిస్తూ…‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ప్రథమ ర్యాంక్ సాధించడం ద్వారా, పెద్ద ఎత్తున కంపెనీలు హైదరాబాద్కు వస్తున్నాయి. పరిశ్రమల ఏర్పాటులో విశేష వృద్ధి కనిపిస్తోంది“ అని తెలిపారు.
పురపాలక శాఖ మంత్రిగా హైదరాబాద్ అభివృద్ధి కోసం ఏం చర్యలు తీసుకున్నారనే ప్రశ్నకు మంత్రి కేటీఆర్ వివరించారు. “హైదరాబాద్ కోసం పలు ప్రణాళికలు రూపొందించాం. రూ. 25,000 కోట్లతో ప్రణాళికలు చేపట్టాం. కేవలం ఇండ్ల కోసమే రూ.8700 కోట్లు ఖర్చు చేస్తున్నాం. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా రూ. 3000 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ప్రస్తుతం పనుల దశలో ఉన్న ఈ ప్రాజెక్టులన్నీ ఈ ఏడాది చివరికల్లా పూర్తయి తమ ఫలాలు అందించడం మొదలుపెడతాయి. మూసీ సుందరీకరణ కోసం రూ.1565 కోట్లు కేటాయించాం. హైదరాబాద్ జలమండలి రూ. 3000 కోట్ల ఖర్చు చేస్తోంది. శామీర్పేట సమీపంలో కేశవపూరం రిజర్వాయర్కు త్వరలో శంకుస్థాపన చేయనున్నాం. 10.84 టీఎంసీల సామర్థ్యంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు రూ. 5000 కోట్లు ఖర్చు చేస్తున్నాం. అన్ని పురపాలక సంఘాలకు ప్రత్యేక నిధులు కేటాయించాం. వరంగల్ మున్సిపాలిటీకి ప్రతి ఏటా రూ.300కోట్లు, మిగతా వాటికి రూ.100 కోట్లు ప్రతి ఏటా దక్కుతున్నాయి. నగర పంచాయతీల కోసం తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఆండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు చేస్తాం. రూ. 1500కోట్లతో ఫండ్ ఏర్పాటు చేశాం. మున్సిపాలిటీల అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యల ఫలితంగా 73 పురపాలక సంస్థలు బహిరంగ మలమూత్ర విసర్జన గుర్తింపును దక్కించుకున్నాయి’ అని మంత్రి కేటీఆర్ వివరించారు.
Post Views: 437