తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ ప్రభుత్వ వైద్యాన్ని బలోపేతం చేసింది. ఆరోగ్యశ్రీ వ్యవస్థను పటిష్టం చేసిన ప్రభుత్వం అన్ని ప్రభుత్వ వైద్యశాలలను కార్పొరేట్ స్థాయిలో ఆధునీకరించి , అత్యున్నత వైద్యసేవలు అందించేందుకు కృషి చేస్తుంది. అలాగే రాష్ట్రంలోని ఉద్యోగస్తులు, పెన్షనర్లు, జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేసింది. ఈ వెల్నెస్ సెంటర్ల పనితీరు అద్భుతంగా ఉండడంతో పెద్ద ఎత్తున వైద్యసేవలు సేవలు రోగులకు అందుతున్నాయి..ఈ వెల్నెస్ సెంటర్ల సేవలు చాలా బాగున్నాయని సీఎం కేసీఆర్ చిన్ననాటి గురువు బాల్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. దుబ్బాకకు చెందిన బాల్రెడ్డి తన మనవరాలు సాయంతో ఆరోగ్య పరీక్షల నిమిత్తం హైదరాబాద్లోని వెల్నెస్ సెంటర్కు వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి వెంటనే ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టుల ఆరోగ్య శ్రీ సీఈవో డాక్టర్ పద్మ, తన పీఆర్వోని అక్కడకు పంపించి, వైద్య సేవలు, పరీక్షలు సజావుగా అందేలా చూశారు. స్వయంగా వారు ఆయనకు వైద్య పరీక్షలు చేయించి, మందులు అందించారు.వెల్ నెస్ సెంటర్లో అందుతున్న వైద్య సేవలపై బాల్ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. తన కోసం చొరవ తీసుకున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని అభినందించారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో మంచి వైద్య సేవలు అందుతున్నాయని, వైద్య ఆరోగ్య శాఖ ఎంతో మెరుగు పడిందని ప్రశంసించారు. తన వద్ద చదువుకున్న సీఎం కేసీఆర్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. త్వరలో తాను రాయబోయే వ్యాసంలో సీఎం కేసీఆర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డిలు వైద్య ఆరోగ్య రంగంలో చేస్తున్న కృషి వివరాలు పొందుపరుస్తానని బాల్రెడ్డి చెప్పుకొచ్చారు. తెలంగాణలో వైద్యసేవలు ఎంతగా మెరుగుపడ్డాయో సీఎం కేసీఆర్ చిన్ననాటి గురువు బాల్రెడ్డి చెప్పకనే చెప్పినట్లయింది.
