నేలపై జాలువారే ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టుకొని భూగర్భజలాలు పెంచడం…ప్రకృతిని కాపాడటం..పశుపక్ష్యాదులకు నీడ కల్పించడం…పచ్చని పంటకు ఆదరువుగా ఉండటం లక్ష్యంగా ఉంటున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన ప్రణాళికలలో మరో ముందడుగు వేసింది. వంతెనలను కేవలం సాఫీగా సాగే ప్రయాణం కోసమే కాకుండా…నేలపై పడిన చినుకును ఒడిసిపట్టే నీటినిల్వ కేంద్రంగా కూడా మార్చేందుకు ప్రణాళిక వేసింది. మెరుగైన ప్రజా రవాణలో భాగంగా వంతెనల నిర్మాణం చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు సమాంతరంగా చెక్డ్యాంల నిర్మాణానికి సైతం ముందుకు సాగింది. వంతెనల నిర్మాణంలో చెక్డ్యాం నిర్మాణం వల్ల భూగర్భజలాల నిల్వలు పెరగడం, పచ్చదనం వృద్ధి చెందడం వంటి ఆలోచనతో వంతెనలు హరిత నిర్మాణాలుగా ప్రతిపాదించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు వంతెనలకు సమాంతరంగా చెక్డ్యాంల నిర్మాణానికి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ సిద్ధమయింది. సీఎం కేసీఆర్ సూచన మేరకు రాష్ట్రంలో 532 వంతెనల నిర్మాణంలో సాంకేతికంగా వెసులుబాటు ఉన్న ప్రాంతాల్లో వంతెనల నిర్మాణానికి సిద్ధమైంది. అయితే ఈ నిర్మాణ ప్రక్రియలో మెళకువలు తెలుసుకునేందుకు మహారాష్ట్రకు ఒక బృందాన్ని పంపించింది. ఈ బృందం వంతెనల నిర్మాణాలను పరిశీలించి 174 ప్రాంతాలలో చెక్డ్యాంల నిర్మాణానికి అనుకూలంగా ఉందని నివేదికలు సమర్పించింది. రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారథ్యంలో అధికారులు చెక్డ్యాంల నిర్మాణానికి వడివడిగా ముందుకు సాగుతున్నారు.
క్ర.సం జిల్లాల వారీగా చెక్డ్యాంలవివరాలు వంతెనల సంఖ్య అంచనా (రూ.కోట్లలో)
1 ఖమ్మం 29 105.80
2. కరీంనగర్ 5 11.75
3. మహబూబ్నగర్ 9 47.30
4.మెదక్ 33 62.68
5. నిజామాబాద్ 8 17.12
6.రంగారెడ్డి 10 64.88
7. నల్లగొండ 5 20.58
8. ఆదిలాబాద్ 63 148.38
9. వరంగల్ 12 42.11
———
మొత్తం 174 520.60
——–
చెక్-డాం ప్రత్యేకతలు
నదులు లేదా వాగుల పరివాహక ప్రాంతాలలో చెక్-డాంలను వర్షపు నీటి సంరక్షణకు ఆనకట్టల మాదిరిగా ఉపయోగించుకోవటం సాధారణమే. అయితే వంతెనల నిర్మాణంలో చెక్-డాంల ఏర్పాటు వినూత్న ప్రయోగమే అని చెప్పాలి. ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఈ చెక్-డాంల రూపకల్పన జరిగింది. వంతెనల నిర్మాణక్రమంలో కేవలం 15% అదనపు ఖర్చుతో ఎటువంటి అదనపు వనరుల అవసరం లేకుండా చెక్-డాం లను పొందుపరచవచ్చు. వారధుల కట్టడాలలో నదీ గర్భంలో బల్లపరుపుగా వేసే శ్లాబు నిర్మాణంపై ప్రవాహ దిశకు అడ్డంగా అంటే వంతెనకు సమాంతరంగా కేవలం రెండు లేదా మూడు వరుసల మేసనరి కట్టడం ద్వారా ఈ చెక్-డాంలను నిర్మించుకోవచ్చు.
వంతెనలకు ఎగువ దిశలో నీటి నిలువకు అనుకూలంగా ఉండే ప్రదేశాల ఎంపిక చాలా కీలకం. చెక్-డాం ల నిర్మాణంలో వంపులు లేని ప్రవాహక్రమం, నీటి నిలువ పరిమాణం, వంతెన మరియు ఇరువైపులా ఉండే కట్టలు ముంపుకు గురి కాకుండా ఉండే విధంగా ఆకృతుల నిర్మాణం వంటి అంశాలు ప్రాధాన్యం కలిగి ఉంటాయి. ఈ చెక్-డాంల నిర్మాణానంతరం పరిసర ప్రాంతాలలో భూగర్భజలాల పెరుగుదల మెరుగుపడినట్లు దాఖలాలు కనిపిస్తున్నాయి. పశుపక్ష్యాదుల తాగు నీటి కొరత ఎంతోకొంత మేర తీరుతున్నది. చెక్-డాంల నిర్మాణాలు ఒక ఉద్యమ స్పూర్తితో చేపడితే పచ్చదనం మెరుగుపడి ఆ ఫలాలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి అని తెలిపిన మంత్రి తుమ్మల. మున్ముందు చెక్-డాంలతో కూడిన వంతెనలను హరిత నిర్మాణాలుగా రూపకల్పన చేసినట్లయితే గ్లోబల్ వార్మింగ్ వంటి సమస్యలు, కర్బన ఉద్గారాల తీవ్రత తగ్గి పర్యావరణానికి ముందు తరాలకు ఏంతో మేలు చేసినట్లు అవుతుంది.
భూగర్భ జలాల పరిరక్షణ, జంతువుల తాగునీటి అవసరార్ధం, ఇతర నీటి వినియోగ అవసరాలకు ఏంతో ఉపయోగంగా ఉంటాయి ఈ చెక్-డాంలు. పెద్దనదులపై నిర్మించే ఆనకట్టల వలన కలిగే ముంపు, వన్య ప్రాణుల అంతరింపు వంటి అభ్యంతరాలు లేకుండా, చిన్న చిన్న మొత్తాలలో పలు ప్రాంతాలలో నీటి నిలువ సాధ్యపడుతుంది. మంత్రి తుమ్మల నాగేశ్వర రావు గారి ప్రత్యక్ష సారధ్యంలో నిరంతర సమీక్షలతో ఈ చెక్-డాంల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చెక్-డాంలు ప్రజల అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో రహదారులు & భవనముల శాఖ అధికారులు కృషి చేస్తున్నారు అని మంత్రి తుమ్మల ప్రశంసించారు.
Post Views: 547