యువహీరో, రెబల్ స్టార్ ప్రభాస్-అనుష్క పెళ్లి చేసుకోబోతున్నారన్న కథనాలు ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిగ్గా మారాయి. అనుష్క-ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నారని, డిసెంబర్లో వీరి నిశ్చితార్థం జరగనుందని సోషల్ మీడియాలో గత రెండు రోజులనుండి చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రచారాన్ని ప్రభాస్ సన్నిహితులు సైతం తోసిపుచ్చుతున్నారు. తమ మధ్య ఏదైనా ఉంటే ఆ విషయాన్ని స్వయంగా అనుష్క, ప్రభాసే చెప్తారు కానీ, ఇలా ఇతరులు వెల్లడించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
మొత్తానికి ‘బాహుబలి-2’ సినిమా విడుదలైన నాటి నుంచి ప్రభాస్-అనుష్క మధ్య లింకప్ గురించి వదంతులు తీవ్రమైన సంగతి తెలిసిందే. ప్రభాస్-అనుష్క ప్రేమలో మునిగిపోయారని గతంలోనూ కథనాలు వచ్చాయి. ప్రభాస్ తాజా సినిమా ‘సాహో’లోనూ అనుష్క తీసుకుంటారని కథనాలు వచ్చాయి. ప్రభాస్-అనుష్క మధ్య చక్కని ఆన్స్క్రీన్ కెమిస్ట్రీ ఉంది. ఈ ఇద్దరూ కలిసి ఐదు సినిమాల్లో జోడీగా నటించారు. తమ మధ్య ప్రేమ కొనసాగుతోందని గతంలో వచ్చిన కథనాలను ఇటు ప్రభాస్, అటు అనుష్క సైతం ఖండించారు.
తాజా వందతుల నేపథ్యంలో ప్రభాస్ ‘నవభారత్ టైమ్స్’ అనే హిందీ పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ.. తన మనస్సులోని మాట వెల్లడించాడు. తొమ్మిదేళ్లుగా అనుష్కతో పరిచయమని, తామిద్దరం మంచి స్నేహితులమని ప్రభాస్ చెప్పాడు. అయితే, తమ మధ్య అనుబంధం ఉందంటూ బలంగా రూమర్స్ రావడంతో.. నిజంగా తమ మధ్య ఏదైనా ఉందా? అన్న భావన అప్పుడప్పుడు తనకు కూడా కలిగేదని ప్రభాస్ నవ్వుతూ చెప్పాడు.
‘తొలిసారి మేం కలిసి పనిచేస్తున్నప్పుడే మా గురించి వచ్చే రూమర్స్ పట్టించుకోవద్దని నిర్ణయించుకున్నాం. తొమ్మిదేళ్లుగా సినీ స్నేహితులుగా కొనసాగుతున్నాం. మేం చాలా మంచి దోస్తులం. కొన్నేళ్లుగా తన గురించి నాకు, నా గురించి తనకు తెలుసు. కొన్నిసార్లు మా చుట్టూ తిరిగే కథనాల గురించి తెలిసినప్పుడు.. మా మధ్య నిజంగా ఏమైనా ఉందా? అని నేను కూడా ఆశ్చర్యపోయేవాడ్ని. కానీ, మాకు తెలుసు మా మధ్య అలాంటిదేమీ లేదని.. అయినా ఇది కొత్తేమీ కాదు. ఒక నటి మరొక నటుడితో ఎక్కువ సినిమాల్లో నటిస్తే.. జనాలు సహజంగానే వారిద్దరి మధ్య ఏదో ఉందని అనుకుంటారు’ అని ప్రభాస్ వివరించాడు.
బాహుబలి సినిమాతో ఒక్కసారిగా నేషనల్ స్టార్గా మారిపోయిన ప్రభాస్.. ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో ‘సాహో’ సినిమాలో నటిస్తున్నాడు. తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటిస్తోంది.