పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈరోజు తెలంగాణ భవన్లో పార్టీ సభ్యత్వ కార్యక్రమ నియోజకవర్గ ఇన్చార్జీలతో ఆయన ఒక సమావేశాన్ని నిర్వహించారు. పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మార్గ నిర్దేశం మేరకు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కేటీఆర్ పార్టీ ఇన్చార్జ్ లను కోరారు. ఇప్పటికే 119 నియోజకవర్గాలకు దాదాపు 60 లక్షల సభ్యత్వ నమోదు పుస్తకాలను పంపిణీ చేశామని, వచ్చే నెల జూలై 20 కన్నా ముందే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఈ సందర్భంగా కేటిఆర్ కోరారు. మొత్తం పార్టీ సభ్యత్వంలో 35 శాతం క్రియాశీలక సభ్యులను నమోదు చేయడం లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. ఈ మేరకు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలతో కలిసి సమన్వయం చేసుకుంటూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఈ సమావేశంలో కేటిఆర్ దిశానిర్దేశం చేశారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సమన్వయం చేసుకునేందుకు రెండు నియోజకవర్గాలకు ఒకరు చొప్పున ఇన్చార్జిలను పార్టీ ప్రకటించింది. దీంతోపాటు హైదరాబాద్ నగర పరిధిలో ప్రతి నియోజకవర్గానికి ఒక ఇన్చార్జిని పార్టీ ప్రకటించింది. పార్టీ నియమించిన ఇన్చార్జులు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రాబోయే రెండు వారాల పాటు ఆయా నియోజకవర్గాల్లో ఉంటూ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో స్థానిక నాయకులందరిని భాగస్వాములను చేస్తూ మొత్తం నమోదు కార్యక్రమాన్ని పర్యవేక్షించాలన్నారు. మరో వారం రోజుల్లో లో ఆన్లైన్, మోబైల్ ద్వారా టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వాన్ని నమోదు చేసుకునే సౌకర్యాన్ని ప్రారంభిస్తామని కేటీఆర్ తెలిపారు.
సభ్యత్వ నమోదు సందర్భంగా తీసుకోవాల్సిన పలు చర్యలను ఈ సమావేశంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటిఆర్ సూచించారు. సభ్యత్వ నమోదు సందర్భంగా కార్యకర్తల పూర్తి సమాచారం సేకరించాలని కోరారు. ముఖ్యంగా కార్యకర్తలకు ప్రమాద భీమా ఉన్నందున, పూర్తి చిరునామా, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్ మరియు నామినీ వివరాలను సేకరించాలన్నారు. ఈ వివరాలుంటే పార్టీ అందిస్తున్న భీమా సౌకర్యానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు భవిష్యత్తులో తలెత్తవని తెలిపారు.
పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంతో పాటు పార్టీ కమిటీల ఏర్పాటుకు సంబంధించి కూడా ఈ సమావేశంలో కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. పార్టీ అధ్యక్షుల ఆదేశం మేరకు పార్టీ కమిటీల్లో కనీసం 51 శాతం బిసి, ఎస్సి, ఎస్టి, మైనారిటీ ఈ కమిటీల్లో ఉండేలా చూడాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ, మండల కమిటీలను, నగరాలు, పట్టణాల్లో వార్డు, డివిజన్ కమిటీ ఏర్పాట్లను కూడా జూలై 20 నాటికి సభ్యత్వ నమోదుతో సమాంతరంగా పూర్తి అయ్యేలా స్థానిక నాయకత్వంతో సమన్వయం చేసుకోవాలని ఇన్చార్జిలకు కేటీఆర్ సూచించారు. ప్రతీ కమిటీలో 15 మందికి తగ్గకుండా చూడాలని, అన్ని కమిటీలోనూ పార్టీ క్రియాశీలక సభ్యులకు మాత్రమే అవకాశం ఇవ్వాలని తెలిపారు. పార్టీ అనుబంధ సంఘాలైన రైతు, యువజన, కార్మిక, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మరియు మహిళా కమిటీలను కూడా ఏర్పాటు చేసుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు.
సభ్యత్వ నమోదు ప్రక్రియను తానే స్వయంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తానని ఈ సందర్భంగా కెటియార్ తెలిపారు. సభ్యత్వ నమోదు వివరాలను ఎక్కడికక్కడే డిజిటలీకరణ చేస్తున్నామని, ప్రతి జిల్లా కేంద్రంలో ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. ఈ మేరకు కార్యక్రమాన్ని పర్యవేక్షించే జిల్లా ఇంచార్జీలను కెటియార్ ప్రకటించారు.
See Also : పెళ్లయినా పిచ్చెకిస్తున్న సమంత