రానున్న వారం, పది రోజుల్లో గ్రామ గ్రామాన రోడ్ల పక్కన పెరిగిపోయిన ముళ్ల పొదలను తొలగించి, హరిత హారానికి సిద్ధం కావాలని పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. సచివాలయం నుండి గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో ఉపాధి హామీ, హరిత హారం కార్యక్రమాలపై మంత్రి జూపల్లి కృష్ణారావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గత సంవత్సరం ఏప్రిల్, మే, జూన్ నెలల్లో 8 కోట్ల 68 లక్షల ఉపాధి పనిదినాలను వినియోగించుకున్నామని…ఈ సారి 10 కోట్ల పని దినాలను జూన్ నెలాఖరు నాటికి పూర్తి చేయాలన్నారు.
see also:తెలంగాణ అభివృద్ధిపై 29 రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల ఎన్ఆర్ఐ ప్రతినిధులు ప్రశంసలు..
రానున్న మూడు నాలుగు నెలలపాటు పెద్ద ఎత్తున హరిత హారం కార్యక్రమాన్ని చేపట్టడంతో పాటు స్కూల్ టాయిలెట్స్, అంగన్వాడీ భవనాలు, వైకుంఠదామాల నిర్మాణాలను ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అక్టోబర్2 నాటికి పురోగతిలో ఉన్న 1223 పాఠశాల టాయిలెట్స్ నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. పని అడిగిన ఏ ఒక్క కూలీకి పని కల్పించలేకపోయినా చర్యలు తప్పవని హెచ్చరించారు. 50 లక్షల 80 వేల మందికి జాబ్కార్డులు ఇచ్చామని…ఇందులో కనీసం 60 శాతం మందికైనా 100 రోజుల పని కల్పించే లక్ష్యంతో ముందుకుపోవాలన్నారు. ఉపాధి కూలీలకు సకాలంలో వేతనాల చెల్లింపు జరిగేలా ఎఫ్ టీ ఓలను వారం, పదిరోజుల్లోనే అప్లోడ్ చేయాలన్నారు. కొత్తగా 647 అంగన్ వాడి భవనాలను మంజూరు చేయడం జరిగిందని…వీటితో పాటు గతంలో మంజూరు చేసిన 1155 భవన నిర్మాణాలను ఆగస్ట్ 15 లోగా పూర్తి చేయాలన్నారు. హరితహారంలో నాటేందుకు నర్సరీ ల్లో అవసరమైన మొక్కలను అందుబాటులో ఉంచాలని, ఏ గ్రామానికి ఏ మొక్కల అవసరం ఉందొ గుర్తించాలని అధికారులకి సూచించారు. నాటిన మొక్కల మనుగడ శాతాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గకుండా చూసుకోవాలని మంత్రి జూపల్లి ఆదేశించారు. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసుకోవాలన్నారు.